|
|
ఐఎన్జీ లైఫ్ ఐ లవ్ మై ఎర్త్ పోటీ
హైదరాబాద్: ఐఎన్జీ గ్రూపులో భాగమైన ఐఎన్జీ లైఫ్ ఇండియా ‘ఐ లవ్ మై ఎర్త్’ అనే పేరుతో పోటీలను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇందులో పాఠశాల విద్యార్థులకు వినూత్న పెయింటింగ్, వ్యాసరచన పోటీలు ఉన్నట్లు తెలిపింది. ఈ పోటీలకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 500కు పైగా విద్యార్థులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు ఐఎన్జీ లైఫ్ పేర్కొంది. ‘పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచంలో వారు ఎలా మార్పు తీసుకురా దలచారన్న విషయంపై వారి భావాలను వ్యక్తపరిచేందుకు ఇది ఒక వినూత్న అవకాశం’ అని ఐఎన్జీ లైఫ్(ఆంధ్రప్రదేశ్) వైస్ ప్రెసిడెంట్ యు.క్రిష్ణదేవ్ అన్నారు.
చిన్నారుల్లో మన భూమి పట్ల అవగాహన, బాధ్యతను పెంచేందుకే మా ప్రయత్నమని చెప్పారు. ఇప్పటికే కొంత మంది విద్యార్థులు వారి పాఠ శాలల ద్వారా పేరును నమోదుచేసుకున్నారని ఆయన తెలిపారు. వీరిలో 3 నుంచి 6 సంవత్సరాల మధ్య వయసుగల చిన్నారులకు పెయింటింగ్ పోటీలు, 7 నుంచి 10 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు పేరాగ్రాఫ్ రైటింగ్ పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. ఇలా పేరును నమోదు చేసుకున్న వారికి పోటీలు నిర్వహిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రతి స్కూల్ నుంచి ఆరుగురు ఫైనలిస్టులను ఎంపిక చేసి వారికి ‘ఐ లవ్ మై ఎర్త్’ ట్రోఫిని అందించడంతో పాటు పాల్గొన్న ప్రతి విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ను అందించనున్నట్లు ఐఎన్జీ లైఫ్ వెల్లడించింది.
|
|
|