|
|
సత్యం కేసులో ఎదురుచూపులొద్దు
ముంబయి: ఇప్పటికే నిరూపితమైన అంశాల ఆధారంగా సత్యం వ్యవస్థాపకుడు రామలింగరాజు, కుంభకోణం కేసుతో ముడిపడిన ఇతరులపై ప్రాసిక్యూషన్ వారి నేరాన్ని రుజువు చేయవచ్చని కార్పొరెట్ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. అందుకు గాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అమెరికా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ల నివేదికల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ డబ్బు విదేశాలకు వెళ్ళిందా అనే అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్, ఐఆర్ఎస్లు విచారణ జరుపుతున్నాయని పేర్కొన్నారు.
ఇంకా తుది నివేదిక రాలేదని చెప్పారు. ఆ నివేదిక కోసం ప్రాసిక్యూషన్ వేచిఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) విచారణ ముగిసిపోయిందని తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని కోర్టులు ఈ విషయంలో ఎలా ముందుకెళ్తున్నాయో చూస్తున్నామన్నారు. ఆయా కంపెనీలు పని చేసే విధానంలో మరింత పారదర్శకతను, ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఆశిస్తోందన్నారు. నూతనంగా రానున్న కంపెనీల బిల్లు స్వతంత్ర డైరెక్టర్ల బాధ్యతను మరింత పెంచుతుందని అన్నారు. ఈ బిల్లు ఎస్ఎఫ్ఐఓకు మరిన్ని అధికారాలను అందిస్తుందని మంత్రి తెలిపారు.
|
|
|