|
|
దశలవారీగానే ఉపసంహరణ
ముంబయి: ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దేశీయ పరిశ్రమలను కాపాడేందుకు కేంద్రం ప్రకటించిన వివిధ ఉద్దీపన ప్యాకేజీలను దశలవారీగానే ఉపసంహరించాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుల మండలి ఛైర్మన్ సి.రంగరాజన్ సూచించారు. ఈ ప్యాకేజీలను ప్రభుత్వం ఉపసంహరించుకోగలదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో రంగరాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుత వృద్ధిరేటు కొనసాగే విధంగా చూస్తూనే, ఈ ప్యాకేజీలను దశలవారీగా ఉపసంహరించాల్సిన అవసరం ఉందని ఆయన భావించారు. ఆర్థిక లోటును తగ్గించేందుకు కొన్ని సర్దుబాట్లు తప్పవని ఆయన వ్యాఖ్యానించారు.
వడ్డీరేట్లలో పెద్దగా మార్పు ఉండదు: ఆర్బీఐ...
స్వల్పకాలిక కార్పొరెట్ రుణాలు లాంటి కొన్నింటిని మినహాయిస్తే, మిగతా వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు ఉండదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి తెలిపారు. రానున్న రెండు, మూడేళ్ళలో మౌలిక వసతుల రంగానికి తగినంతగా రుణాలు అందించేందుకు అవసరమైన నిధులు బ్యాంకుల వద్ద ఉన్నాయని ఆయన అన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లకు సంబంధించి కొన్ని నిబంధనలను సడలించాల్సిందిగా బ్యాంకులు కోరుతున్నప్పటికీ ఆర్బీఐ అందుకు అంగీకరించడం లేదు. దీనికి గనుక అంగీకరిస్తే, ఇలాంటి డిమాండే ఇతర బాండ్లకు సంబంధించి కూడా తలెత్తే అవకాశం ఉందని ఆర్బీఐ భావిస్తోంది.
|
|
|