|
|
సాయం అందేది ఎన్నటికో …?!
పిడుగురాళ్ల: గత ఏడాది అక్టోబర్ మాసంలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి వరద రూపంలో పోటెత్తడంతో పచ్చటి పొలాలతో పాటు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న గృహాల్లోకి సైతం భారీ ఎత్తున వరద నీరు చేరడంతో అన్ని విధాలుగా నష్టపోయిన తమకు సాయం అందేది ఎన్నటికో అర్థం కావడం లేదని పల్నాడు ప్రాంతంలోని వరద బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఊహించని రీతిలో గత ఏడాది అక్టోబర్ మూడవ తేదీన శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరిన క్రమంలో పల్నాడు ప్రాంతమైన దాచేపల్లి మండలంలోని తంగెడ, ఏలియం పేట, కాట్రపాడు, రామాపురం, పొందుగుల, మాచవరం మండలంలోని గోవిందాపురం, వెల్లంపల్లి, రేగులగడ్డ, బెల్లంకొండ మండలంలోని పులిచింతల, కోళ్లూరు,కేతవరం, చిట్యాల, చిట్యాల తండా, గొల్లపేట, బోదనం తదితర ప్రాంతాల్లో తీవ్రంగా పంటకు న ష్టం చేకూరడంతో పాటు గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించడంతో ఆయా గ్రామాల ప్రజానీకం కొంత మేర ఆస్తినష్టాన్ని సైతం చవిచూడాల్సి వచ్చింది. అప్పటికే రైతన్నలు పంటపై పెట్టిన పెట్టుబడి మొత్తం నీటి పాలవ గా బెల్లంకొండ మండలంలో 572 గృహాలు నీట మునగగా వాటిలో 11 గృహాలు పూర్తిగా, మరో 18 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అదే విధంగా మాచవరం మండలంలో 211 గృహాలు నీటమునగగా 23 పూర్తిగా, 17 పాక్షికంగా, దాచేపల్లి మండలంలో 153 గృహాలు నీట మునగగా 12 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
అయితే వరద సమయంలో ఇటు ప్రభుత్వం అటు స్వచ్ఛంద సేవా సంస్థలు సహాయక చర్యలు చేపట్టడం, అనంతరం పరిణామాల క్రమంలో వరద బాధితులకు పరామర్శల వెల్లువ పోటెత్తింది. అయితే వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమకు నాలుగు నెలలవుతున్నా ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు ఎలాంటి నష్టపరిహారం అందలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆ సమయంలో పంటలు వేసి పెట్టుబడులు పెట్టిన తాము ఊహించని రీతిలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో తీవ్రంగా నష్టపోయామని బాధితులు పేర్కొంటున్నారు. నాటి నుండి నేటి వరకు ప్రభుత్వ పరంగా సాయం కోసం ఎదురు చూపులు మినహా సాయం అందించే వారే కరువయ్యారని వారు ఆరోపిస్తున్నారు.
తిరిగి నష్టాల నుండి కోలుకునేందుకు అందిన చోటల్లా అప్పులు చేసినా కాలువ చివరనున్న తమ భూములకు నీరు తగిన విధంగా అందక పోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వారు వాపోతున్నారు. నాడు నీరు పోటెత్తడంతో నష్టపోయిన తాము నేడు నీరు అందక నష్టపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఇప్పటికైనా గత ఏడాది అక్టోబర్లో సంభవించిన కృష్ణానది వరద ముంపు బాధితుల మైన తమపై కనికరం చూపాలంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగు రీతిన స్పందించి త క్షణమే తమకు నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కృష్ణానది వరద తాకిడికి తీవ్రంగా నష్టపోయిన పల్నాడు ప్రాంతంలోని నదీ పరివాహ ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
|
|
|