|
|
మృత్యుంజయుడు మల్లయ్య
- 19గంటలు జీవన్మరణ పోరాటం
హైదరాబాద్: నారాయణగుడా సెంటర్లో శుక్రవారం భవనం కూలిన ఘోర దుర్ఘటనలో 13మంది మరణించగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని జిల్లా కలెక్టర్ నవీన్మిట్టల్ తెలిపారు. నిన్న సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున భవన శిథిలాలను తొలగించడంలో పోలీసు, ఫైర్ సర్వీస్, రెస్క్యూబృందాలు, స్థానికులు నిర్విరామంగా కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. దాదాపు 19గంటల అనంతరం శనివారం ఉదయం భవన వాచ్మెన్ మల్లయ్యను రెస్క్యూ బృందం ప్రాణాలతో బయటికి తీసుకురాగలిగిందని ఆయన సంతోషం వ్యక్తం చేసారు. స్వల్ప గాయాలు మినహా మల్లయ్య సురక్షితంగా ఉన్నాడని ఆయన చెప్పారు. జరిగిన ప్రమాదానికి మల్లయ్య దిగ్భ్రాంతికి లోనయ్యాడని, సమాచారాన్ని పూర్తిగా వెల్లడించలేని పరిస్థితిలో ఉన్నాడని రెస్క్యూబృందం తెలిపింది. దాదాపు 19గంటలు శిథిలాలలో చిక్కుకొని ఆందోళన చెందిన మల్లయ్య ఎట్టకేలకు మృత్యుంజయుడై బ్రతికి బయటపడడం పట్ల అతని బంధువులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేసారు. కాగా కూలిన భవనానికి ఎటువంటి అనుమతులు లేవని తెలిసిందని కలెక్టర్ తెలిపారు.
|
|
|