|
|
అయ్యా మేం బతికే ఉన్నాం!
సంగెం: 'అయ్యా మేం బతికే ఉన్నాం. చనిపోలేదు. అధికారులు మాత్రం మమ్మల్ని రికార్డుల్లో చంపేశారు. పింఛన్ ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ, మేం బతికే ఉన్నట్లు గుర్తించండి. మేం నిజంగా మనుషులమే. దెయ్యాలం కాదు.' అంటూ నల్లా శ్రీనివాస్, గొటుకుల బాలయ్య అనే పింఛన్దారులు ఎంపీడీఓ కార్యాలయంలో ఇన్చార్జ్ ఈఓపీఆర్డీకి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వంజరపల్లి గ్రామానికి చెందిన నల్లా శ్రీనివాస్ వికలాంగుడు.
అదే గ్రామానికి చెందిన గొటుకుల బాలయ్య 70 ఏళ్ల వృద్ధుడు. వీరిద్దరికీ ప్రభుత్వ పింఛన్లు అందుతున్నాయి. అయితే ఇటీవల చేపట్టిన సామాజిక తనిఖీలో భాగంగా వీరి ఇంటికి వెళ్లి కార్డులు పరిశీలించిన అధికారులు వీరిద్దరూ మరణించి నట్లు నివేదిక పంపారు. గత జనవరి వరకు పింఛన్లు తీసుకున్న వీరు ఈ నెల పింఛన్ తీసుకోవడానికి వెళ్లారు. అయితే ఇంటింటి సర్వేలో మరణించినట్లు రికార్డులో ఉన్నదున పింఛన్ ఇవ్వలేమని అధికారులు చెప్పారు. దీంతో కంగుతిన్న వారిద్దరూ ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి మేం బతికి ఉన్నట్లు ధ్రువీకరించాలని ఇన్చార్జ్ ఈఓపీఆర్డీ లకీనర్సింహరావును వేడుకున్నారు. జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
|
|
|