|
|
సేంద్రియ ధ్రువీకరణతో గిట్టుబాటు ధరలు...
జిల్ల్లాలో 660 ఎకరాలకు గుర్తింపు
శ్రీకాకుళం: అంతర్జాతీయ విపనిలో సైతం వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహక ధరలకు విక్రయించేందుకు సేంద్రియ ధ్రువీకరణ విధిగా ఉండాలని జాతీయ ఎపప్ అర్గనిక్ సర్టిఫికేషన్ ఏజన్సీ చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సిపిఓ) కె.దోరైరాజు పేర్కొన్నారు. సేంద్రియ వ్యవసాయ సాగులో ఆగ్రగామిగా వున్న పొందూరు మండలం లక్ష్మీపేటను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లక్ష్మీపేట గ్రామానికి సేంద్రియ ధ్రువీకరణను మొదటిఏడాదికి అనుమతిస్తున్నామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా 6.72కోట్ల ఎకరాలకు సేంద్రియ ధ్రువీకరణ లభించిందన్నారు. రాష్ట్రానికి సంబంధించి 23 వేల ఎకరాల భూములకు ఈ ధువ్రీకరణ కల్పించామన్నారు. ఉత్తరాంచల్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ రాష్ట్రాలు సేంద్రియ వ్యవసాయంలో ముందున్నాయని వివరించారు. శ్రీకాకుళం రైతు శిక్షణా కేంద్రం ఉపసంచాలకులు కె.వేణుగోపాలరావు మాట్లాడుతూ, జిల్లాలోని ఏడు మండలాల్లో 660 ఎకరాలకు సేంద్రియ సంపూర్ణ ధ్రువీకరణలభించిందన్నారు. మూడేళ్లనుంచి ఆ గ్రామాల్లో ఈ సాగు అమలులో ఉన్నందున ధ్రువీకరణ సమకూరిందన్నారు. తాజాగా జిల్లాలో పొందూరు మండలం లక్ష్మీపేట, పాతపట్నం మండలంలోని గోపాలపురం, చిన్నమల్లిపురం గ్రామాల్లోని 200 ఎకరాలకు లభించిందని పేర్కొన్నారు. ఎఫ్టిసి సహాయ సంచాలకులు పి.శివప్రసాద్ మాట్లాడుతూ, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో 20 నుండి 40 శాతం అధిక ధర లభిస్తుందన్నారు. జిల్లాలోని 120 మంది రైతులకు 2 గ్రూపుల కింద సేంద్రియ వ్యవసాయ ధ్రువీకరణ అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు కెవి రామరాజు, రైతు శిక్షణ కేంద్ర వ్యవసాయ అధికారులు వై.శారద, శ్రీలత, రైతులు, మహిళా రైతులు పాల్గొన్నారు.
|
|
|