|
|
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు:హోంమంత్రి
హైదరాబాద్: రాజధాని నగరంలో రోజురోజుకు జఠిలమవుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా శనివారం జూబ్లీహాలులో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నగర ప్రజాప్రతినిధులు, సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కార్యచరణ ప్రణాళిక రూపొందించేందుకు సమావేశంలో చర్చించారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపించాలని నిర్ణయించారు. రద్దీగా ఉండే రహాదారులపై పాఠశాలలు, ఆసుపత్రులు తదితర సంస్థల నిర్వహణకు అనుమతినియరాదని నిర్ణయించారు. ట్రాఫిక్కు ఆటంకం కలిగించే అక్రమ నిర్మాణాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని తీర్మానించారు. భారీ వాహనాలు నగరంలో సంచరిస్తూ ట్రాఫిక్ రద్దీని పెంచుతున్న విషయం కూడా సమావేశంలో చర్చించారు. అవుటర్ రింగురోడ్డు వద్ద బస్సు టెర్మినల్స్, ట్రక్ పార్కింగ్ కోసం స్థలం కేటాయించాలని తీర్మానించారు. ఇందుకు అనువైన స్థలాన్ని సేకరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను హోంమంత్రి ఆదేశించారు. నగరంలో వివిధ రద్దీ ప్రాంతాలలో నిర్మించిన కొన్ని మతపరమైన కట్టడాలు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయని పోలీసు ఉన్నతాధికారులు సమావేశం దృష్టికి తెచ్చారు. సున్నితమైన మతపరమైన అంశాలు ఇందులో ఇమిడి ఉన్నందున వాటి తొలగింపు ప్రక్రియ కష్టమవుతున్నదని చెప్పారు. దీంతో ట్రాఫిక్రద్దీ పెరిగి తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుందన్నారు. దీనిపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ట్రాఫిక్కు అడ్డుగా ఉన్న మతపరమైన కట్టడాల తొలగింపునకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాన రహాదారులలో పాఠశాలలు, ఆసుపత్రులు, కళాశాలలకు అనుమతినివ్వరాదని బిజెపి ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి కోరారు. రాజధానిలో రాజకీయ జోక్యం ఉన్నంత కాలం ట్రాఫిక్ సమస్య పరిష్కారం కష్టమేనని లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో మంత్రి ముఖేష్గౌడ్, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, పోలీసు కమీషనర్ ఏ.కె. ఖాన్, తదితర ఉన్నతాధికారులు నగర ప్రజాప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.
|
|
|