|
|
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే గిరిజనుల అభివృద్ధి
ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకే మన్యం రాష్ట్రాన్ని(గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రం) తెరపైకి తెస్తున్నారని గిరిజన సంఘాల జేఏసీ నాయకులు శ్రీరామ్శంభు, ప్రభాకర్లు ఆరోపించారు. రాష్ట్ర సాధనలో గిరిజనులు ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా వున్నారని వారు పేర్కొన్నారు. ఉద్యమాలు చేయడం గిరిజనులకు కొత్తదేమి కాదని నాడు నిజం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఆదివాసి గిరిజనులకు ఉందని వారన్నారు. కుమరంభీమ్ను ఆదర్శవంతంగా తీసుకొని తెలంగాణను సాధించేందుకు ముందుకెళ్తామని అన్నారు. నాడు గిరిజనల హక్కుల కోసం పోరాడి సాధించుకున్న విధంగానే నేడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని వారు స్పష్టం చేశారు. గిరిజనుల సత్తాను చాటేందుకే ఈనెల 13న గిరిజ గర్జన ఉట్నూరులో నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదడరాంతో పాటు మేధావులు పి.నారాయణతో పాటు పలువరు పాల్గొంటారని వారు పేర్కొన్నారు. ఈ బహిరంగ సభకు జిల్లాలోని గిరిజనులతో పాటు తెలంగాణ జిల్లాలలోని గిరిజనులు పాల్గొంటారని వారు తెలిపారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడల్ల ఆంధ్రా పాలకులు దానిని ఎందో విధంగా అనిచివేసేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారని వారు ఆరోపించారు. ఏదిఏమైనా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని ఇందుకోసం ఏ త్యాగానికి కూడా గిరిజనులు సంసిద్ధంగా వున్నారని స్పష్టంచేశారు. గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని, మన్యం రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఆంధ్రా పాలకులు చేస్తున్న ప్రకటనలను వారు ఖండించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే గిరిజనుల సమస్యలు పరిష్కారం కావడమేకాకుండా ఎంతో అభివృద్ధి సాధిస్తారని వారు స్పష్టం చేశారు. వెంటనే కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభించి నిర్ణయిత గడువులోగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
|
|
|