|
|
నా వ్యాఖ్యలు అపార్థం పాలయ్యాయి: షారుఖ్ ఖాన్
ముంబై: పాకిస్తాన్ క్రీడాకారులకు సంబంధించి తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని బాలివుడ్ నటుడు, ఐ.పి.ఎల్లో కోల్కత్తానైట్రైడర్స్ సహ యజమాని షారుఖ్ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ క్రీడాకారులను ఐపిఎల్లో ఆడిస్తే బాగుండేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలకు ఆయన శివసేన నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో షారుఖ్ శనివారం లండన్ నుంచి ముంబైకి తిరిగి వచ్చారు. విమానాశ్రయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తన వ్యాఖ్యలు అపార్థం చేసుకున్నారని తానెప్పుడు ఇతర దేశాలతో సత్ససంబంధాలను కోరుకునే వ్యక్తినేనని అన్నారు. తనకు తన దేశం పట్ల కానీ ఇతర దేశాల పట్ల కాని వివక్ష లేదని ఆయన అన్నారు. అత్యంత భారీ భద్రత మధ్య ఆయన ముంబై విమానాశ్రయానికి చేరుకొన్నారు. తన వ్యాఖ్యలను అపార్థంచేసుకున్నారని చెపుతూ ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు తనకు తానుగా శివసేన అధినేత బాల్ థాక్రేతో సమావేశమయ్యే అవకాశాలను త్రోసిపుచ్చారు. తనపై విమర్శనాస్త్రాలను సంధిస్తున్న బాల్థాక్రే ఇంటికి వెళతారా అని ప్రశ్నించగా, ఆయన చాలా అనుభవజ్ఞుడైన నేత. గతంలో ఆయన ఆహ్వానించినపుడుల్లా ఆయన ఇంటికి వెళ్లానని చెప్పారు. చాలా సార్లు ఆయన ఇంటికి వెళ్లి ఆయనతో మంచి సమయాన్ని గడిపానని చెప్పారు. అయితే ఈ విషయమై అక్కడికి వెళ్లి ఆయన్ని ప్రాదేయపడడంలో అర్థం లేదన్నారు. ఒకవేళ నావైఖరిపై ఎవరికైనా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఇప్పటికే తాను ఆ పని చేశానని షారుఖ్ఖాన్ చెప్పారు. ఎవరికైన అపార్థాలుంటే కలిసి కూర్చొన సామరస్యంగా చర్చించుకోవచ్చన్నారు. ముంబై భారతీయులందరిది అన్న వ్యాఖ్యలపై చెలరేగిన వివాదం నేపథ్యంలో తాను మాట్లాడుతూ, భారతీయులు చెప్పేదే తాను చెప్పానని అది రాజ్యాంగంలోనే ఉందని అన్నారు. అయితే తాను పెద్ద పెద్ద మాటలు ఉపయోగించనని చెబుతూ తాను ఏమి మాట్లాడిన అది అపార్థాలకు దారి తీస్తుందని అన్నారు. ముంబైలో ప్రతివారు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని జరిగిన పరిణామాలు దురదృష్టకరమని అన్నారు. అన్ని వర్గాలు ముంబై వాసులు అలాగే కోరుకుంటాయని అటువంటపుడు ఈ రకమైన వాతావరణం ఎందకు ఏర్పడుతుందని అన్నారు. తన జట్టులో ఒకే విదేశీ స్లాట్ ఉన్నదని పాకిస్తాన్ క్రీడాకారులను తీసుకోవాలని గానీ తీసుకోవద్దని గానీ ఎవరు చెప్పలేదని అన్నారు. అప్పటి పరిస్థితులను కూడా తాము పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కాగా ప్రపంచంలో అతి పెద్దదైనా స్టాక్ ఎక్సేంజి నాస్డాక్లో ప్రారంభగంట మోగించడం తనకు లభించిన అత్యంత గౌరవమని, భారతీయుడిగా తానెంతో గర్వించానని అది తనకు లభించిన గౌరవ ప్రదమైన గుర్తింపుగా భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. నాస్డాక్లో ప్రారంభ గంట మోగించే అవకాశం తొలిసారిగా బాలీవుడ్ నటులు షారుఖ్ఖాన్, కాజోల్లకే దక్కింది. సాధారణంగా ఈ కార్యక్రమానికి ప్రముఖ కార్పోరేట్ సంస్థల సీఇఓలకే అవకాశం లభిస్తుంది. అమెరికా, లండన్, బెర్లిన్లలో తన తాజా చిత్రం మైనేమ్ ఇస్ ఖాన్ ప్రమోషన్ కార్యక్రమాలు ముగించుకొని చిత్ర దర్శకుడు కరణ్ జోహార్తో పాటు వారిరువురు స్వదేశం తిరిగి వచ్చారు. ఈ సినిమా ఈ నెల 12వ తేదీన విడుదల కానున్నది.
|
|
|