|
|
తెలంగాణా కోసం మరో విద్యార్థి బలిదానం
ఆదిలాబాద్: తెలంగాణా కోసం జిల్లావ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగుతుండగా మరో వైపు విద్యార్థులు బలిదనాలు చేసుకుంటున్నారు. కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తున్న ధోరణిని తట్టుకోలేక తెలంగాణా రాదనే బెంగతో విద్యార్థులు మానసికంగా కుంగిపోతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జిల్లాల్లో ఇప్పటి వరకు రెండు అంకెల సంఖ్యలో విద్యార్థులు తమ ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది. సోమవారం తలమండలంలోని బరంపూర్ గ్రామానికి చెందిన డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న కె.సతీష్కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మరణానికి ఎవరూ కారకులు కారని తెలంగాణా కోసం ప్రాణాలు అర్పిస్తున్నానని ఆయన ఓ లేఖ వ్రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన మరణం విద్యార్థి లోకాన్ని కుదిపివేసింది. ప్రత్యేక తెలంగాణా తేవడమే విద్యార్థుల కర్తవ్యమని రాజకీయ నాయకుల కుటిల నీతి వల్ల తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కావడం లేదని తన లేఖలో పేర్కొన్నాడు. పేద కుటుంబంలో పుట్టిన సతీష్కుమార్ చదువులో ముందుంటూ తల్లిదండ్రులను ఆదుకుంటాడని ఎంతో నమ్మకంతో కూలీ నాలీ చేసి తల్లిదండ్రులు చదివిపిస్తున్నారు. తెలంగాణాకోసం తన ప్రాణాలను అర్పిస్తున్నానని మరో జన్మాంటూ ఉంటే తన కన్నతల్లి కడుపున పుట్టి రుణం తీర్చుకుంటానని లేఖలో పేర్కొనడంతో గ్రామస్థులతోపాటు విద్యార్థిలోకాన్ని కంట తడిపెట్టించింది. విద్యార్థులు తెలంగాణా కోసం నిరంతరం ఉద్యమిస్తుంటే నాయకులు తమ రాజకీయ లబ్దికోసం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారు. గతంలో కూడా పలువురు విద్యార్థులు తెలంగాణా రాదనే బెంగతో ఆత్మహత్యలు చేసుకోవడాన్ని విన్న ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. సతీష్కుమార్ మరణానికి సంతాప సూచకంగా జిల్లా బంద్కు పిలుపునివ్వడంతో పాటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. విద్యార్థి జేఏసీ పిలుపుమేరకు ఆదిలాబాద్ డివిజన్లోని అన్ని ప్రైవేటు కళాశాలలను మూసివేయగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తరగతులను బహిష్కరించి సతీష్కుమార్ మృతికి సంతాపం తెలియజేశారు. ఇక నుండి విద్యార్థులు ఎలాంటి ఆత్మహత్యలకు పాల్పడకుండా తెలంగాణా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని రాష్ట్ర సాధన కోసం కృషి చేయాలని జిల్లా జేఏసీ చైర్మన్ నారాయణ పిలుపునిచ్చారు. కాగా జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసన కార్యక్రమాలు మంగళవారం నాటికి 38వ రోజుకు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా రాష్ట్రం ఏర్పాటు చేయాలని మంగళవారం ర్యాలీలు, ధర్నాలు, నిర్వహించారు. తెలంగాణా ఏర్పాటు విషయంలో కేంద్రప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుంటే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు.
|
|
|