|
|
కుదించిన ముఖ్యమంత్రి పర్యటన
ఆదిలాబాద్: సింగరేణి యజమాన్యం రెండున్నర వేల కోట్ల రూపాయలతో చేపట్టిన 600 మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గత యేడాది ఆగస్టు నెల నుంచి ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయించాలని యజమాన్యం నిర్ణయించడంతో వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈనెల 13న జైపూర్ మండల కేంద్రంలో శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి పర్యటన అధికారికంగా ఖరారు అయింది. ఈ శంకుస్థాపనతో పాటు ముఖ్యమంత్రి బహిరంగ సభలో ప్రసంగించడంతో పాటు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన పర్యటనను శంకుస్థాపన కార్యక్రమానికి మాత్రమే కుదించారు. అయితే ఈ కుదింపు కారణాలు తెలంగాణా వ్యాప్తంగా ఉద్యమాలు జరగడం, సింగరేణి ప్రాంతంలో ఉద్యమ ప్రభావం అధికంగా ఉండడంతో బహిరంగ సభకు ఏమైనా అంతరాయాలు ఏర్పడుతాయనే ఉద్ధేశంతో ఈ బహిరంగ సభను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఆయన పైకి మాత్రం అదే రోజు మండలంలో పెద్ద ఎత్తున వేలాల జాతర జరుగుతుండడంతో ప్రజలను సమీకరించే అవకాశాలు లేకపోవడంతో ముఖ్యమంత్రి కార్యక్రమాలను కుదించినట్లు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఈ ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ఈ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ అహ్మద్ నదీంతో పాటు సింగరేణి అధికారులు పరిశీలించారు. ఎలాంటి అంతరాయం కలగకుండా ముఖ్యమంత్రి పర్యటన సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
|
|
|