|
|
గనుల ప్రైవేటీకరణపై చలో కొత్తగూడెం
ఆదిలాబాద్: తాడిచర్ల బొగ్గుగనిని ప్రైవేటు కంపెనీలకు అప్పగించడాన్ని నిరసిస్తూ ఈనెల 10న చలో కొత్తగూడెం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఎఫ్టియు బెల్లంపల్లి రిజియన్ అధ్యక్షుడు సమ్మయ్య తెలిపారు. తన సొంత అవసరాలకోసం అయిదు కోట్ల టన్నుల ఎఫ్ గ్రేడ్ బొగ్గు నిల్వలు ఉన్న తాడిచర్ల బ్లాక్ను ఎపిజెన్కోకు ప్రభుత్వం కుట్ర పూరితంగా అప్పగించిందని ఆయన ఆరోపించారు. సింగరేణి యజమాన్యం ఎంతో వ్యయం చేసి ఏర్పాటు చేసిన ఈ బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయడం శోఛనీయమన్నారు. అధికారంలోకి రాకముందు బొగ్గుగనులను ప్రైవేటీకరణ చేయమని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం బొగ్గుగనులను ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతుందని ఆయన విమర్శించారు. బొగ్గుతీసే అనుభవం ఒక్కసింగరేణికే ఉందని, ఈ దశలో ఎలాంటి అనుభవం లేని సంస్థకు బొగ్గుగనులను అప్పగించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. బొగ్గుగని ప్రైవేటీకరణ వల్ల సింగరేణి యజమాన్యానికి వేలకోట్ల రూపాయలు నష్టపోవడం జరుగుతుందన్నారు. వెంటనే ప్రభుత్వం తమ ఆలోచన విరమించి సింగరేణికి, కార్మికులకు నష్టం చేసే ఆలోచనను మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి చేపట్టిన ఈ చలో కొత్తగూడెం కార్యక్రమానికి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా కొత్తగూడెంలోని కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన పేర్కొన్నారు.
|
|
|