|
|
తెలంగాణా కోసం విద్యార్థులు బలిదానాలు ఆపాలి
ఆదిలాబాద్: తెలంగాణా ఉద్యమం కోసం విద్యార్థులు బలిదానాలను వెంటనే ఆపాలని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు బి.నారాయణ పిలుపునిచ్చారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణాపై ద్వంద్వ విధానాలను విడనాడి పదవులకు, పార్టీ సభ్యత్వాలకు రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నాయకుల మోసపూరిత రాజకీయాలకు విద్యార్థులు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఉద్యమాల్లో విద్యార్థులు చనిపోతున్నారు తప్పా ఏ ఒక్క రాజకీయ నేత గానీ వారి పిల్లలు కానీ చనిపోవడం లేదన్నారు. క్షణికావేశాన్నికి గురై విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. బలిదానాలతో తెలంగాణా రాష్ట్రం రాదని ఆత్మస్థైర్యంతో ఉద్యమిస్తే తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా తెలంగాణా ప్రజలు చేస్తున్న ఉద్యమాలకు స్పందించి కేంద్ర ప్రభుత్వం వెంటనే సరైన నిర్ణయం తీసుకుని విద్యార్థుల ఆత్మహత్యలను నిరోధించాలని ఆయన డిమాండ్ చేశారు.
|
|
|