|
|
సచిన్ భారతరత్నమే!
* అవార్డు కోసం సిఫార్సు చేయనక్కర్లేదు
* ఇలాంటి యోధులు మహారాష్ట్రలోనే పుడతారు
* శివసేన అధినేత బాల్థాకరే వ్యాఖ్యలు
ముంబయి: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ద్విశతకానికి శివసేన అధినేత బాల్థాకరే కూడా క్లీన్బౌల్డ్ అయ్యారు. 100 కోట్ల మంది భారతీయులు సచిన్కు ఇప్పటికే 'భారతరత్న' కిరీటం అలంకరించారని పేర్కొన్నారు. ఆయనకు అత్యన్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలంటూ కొత్తగా ఎవరూ సిఫార్సు చేయాల్సిన అవసరం లేదన్నారు. ''శివాజీ మహారాజ్ తన ఖడ్గంతో యుద్ధభూమిలో మొఘల్ పాలకులను ఓడించాడు. సచిన్ క్రీడామైదానంలో తన బ్యాట్తో ప్రత్యర్థులను చిత్తు చేశాడు. ఇలాంటి మహాయోధులు మహారాష్ట్రలో మాత్రమే జన్మిస్తారు'' అని శివసేన పత్రిక ''సామ్నా'' సంపాదకీయంలో బాల్థాకరే పేర్కొన్నారు. ముంబయి నగరం భారతీయులందరిదన్న సచిన్పై గతంలో బాల్థాకరే కారాలుమిరియాలు నూరిన సంగతి తెలిసిందే.
గ్వాలియర్లో దక్షిణాఫ్రికా జట్టుపై 200 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన చిచ్చరపిడుగు సచిన్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలంటూ పలు పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం కేంద్రానికి సిఫార్సు చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్చవాన్ ప్రకటించారు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతోపాటు ఇతర క్రికెటర్లు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
|
|
|