బ్రహ్మపుత్ర వేలీ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీవీఎఫ్సీఎల్), నామరూప్ (అసమ్)కు యూరియా తయారీ విభాగాల నిర్వహణను కొనసాగించడం కోసం 100 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించవలసిందంటూ ఎరువుల విభాగం తీసుకు వచ్చిన ప్రతిపాదనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్న ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఈ రోజున ఆమోదం తెలిపింది.
కంపెనీల చట్టం ప్రకారం భారత ప్రభుత్వ ఎరువుల విభాగం (డీఓఎఫ్) పరిపాలనపూర్వక నియంత్రణలోని ఓ ప్రభుత్వ రంగ సంస్థగా బ్రహ్మపుత్ర వేలీ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీవీఎఫ్సీఎల్), నామరూప్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కంపెనీ అసమ్లోని నామరూప్లో గల బీవీఎఫ్సీఎల్ పరిసరాలలో తన రెండు పాత ప్లాంటులైన నామరూప్-IIని, నామరూప్-IIIని నడుపుతున్నది. భారతదేశంలో గ్యాస్ ఆధారితంగా నడిచే తొలి యూరియా తయారీ యూనిట్ కావడంతో పాటు మౌలిక సదుపాయాల పరంగా, ఫీడ్ స్టాక్ అందుబాటు పరంగా కొదువ ఏమీ లేకపోయినప్పటికీ కూడా తన ప్లాంటులలోని సాంకేతిక విజ్ఞానం పాతదీ, కాలం చెల్లిపోయిందీ అయినందువల్ల ఈ కంపెనీ కి ఖర్చుకు తగిన విధంగా సముచితమైన ఉత్పాదన స్థాయిని నిలబెట్టుకోవడం కష్టం అయిపోతోంది. ఈ ప్లాంటులను సురక్షితమైన విధంగాను, నిలకడైన రీతిలోను, ఆర్థిక నిర్వహణ పరంగా ఇవి సజావుగా సాగాలి అంటే గనక కొన్ని యంత్రాలను, ఉపకరణాలను పూర్తి మరమ్మత్తు చేయవలసిన /కొత్త సామగ్రిని సమకూర్చవలసిన అవసరం ఎంతయినా ఉంది. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఉత్ప్రేరక వస్తువులు మొదలైన వాటిని కొనుగోలు చేయడంతో పాటుగా యూనిట్లను సాఫీగా నిర్వహించడానికి కనీస నిర్వహణ సంబంధిత మరమ్మత్తులకు 100 కోట్ల రూపాయలు ఖర్చు కావచ్చని అంచనా వేయడమైంది. మరి ఈ కారణంగా భారత ప్రభుత్వం బ్రహ్మపుత్ర వేలీ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీవీఎఫ్సీఎల్)కు 100 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఆమోదం తెలిపింది.
భారతదేశ ఈశాన్య ప్రాంతంలో ఏర్పాటైన బ్రహ్మపుత్ర వేలీ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీవీఎఫ్సీఎల్), ఆ ప్రాంతంలో ఆర్థిక వృద్ధికి ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నది. బీవీఎఫ్సీఎల్కు 100 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తే ప్రతి సంవత్సరం 3.90 లక్షల ఎమ్టీ యూరియా ఉత్పత్తి సామర్ధ్యం కొనసాగుతూ, యావత్తు ఈశాన్య ప్రాంతంలో, ప్రత్యేకించి అసమ్లో, తేయాకు పరిశ్రమకు, వ్యవసాయ రంగానికి యూరియా సకాలంలో అందుబాటులో ఉండేటట్లుగా ఈ కంపెనీ పూచీ పడగలుగుతుంది. దీనితో సుమారు 580 మంది ఉద్యోగులకు శాశ్వత ప్రాతిపదికన, మరో 1500 మందికి అడ్హాక్ ప్రాతిపదికన ఉపాధి కొనసాగేందుకు ఆస్కారం ఉంటుంది. దీనికి అదనంగా, ఈ సంస్థ ద్వారా 28,000 మందికి పరోక్ష ప్రయోజనం కూడా లభిస్తుంది. దీనితో భారత ప్రభుత్వ ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’కు సైతం ఊతం అందుతుంది.