న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (న్యూస్టైమ్): ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్లో మహారాజా సుహేల్ దేవ్ స్మారకానికి, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. మహారాజా సుహేల్దేవ్ పేరును పెట్టినటువంటి ఒక వైద్య కళాశాల భవనాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పాలుపంచుకొన్నారు.
ఈ సందర్భంలో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ భారతదేశం చరిత్ర అంటే అది వలసవాద శక్తులు లేదా వలసవాద మనస్తత్వం కలిగి ఉన్న శక్తులు రాసిన చరిత్ర ఒక్కటే కాదని పేర్కొన్నారు. సామాన్య ప్రజానీకం జానపద గాథలలో పెంచి పోషించుకొంటూ వచ్చినటువంటి, తరాల తరబడి ముందుకు తీసుకుపోతున్నటువంటిదే భారతదేశ చరిత్ర అని ఆయన అన్నారు. భారతదేశం కోసం, భారతీయత కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన వారికి చరిత్ర పుస్తకాలలో ఇవ్వవలసినంత గౌరవాన్ని ఇవ్వడం జరుగలేదు అంటూ ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ అపసవ్యాలను, భారతదేశ చరిత్ర రచయితల ద్వారా దేశ చరిత్ర నిర్మాతలకు జరిగిన అన్యాయాన్ని మనం మన స్వాతంత్య్ర 75వ సంవత్సరంలోకి ప్రవేశించనున్న ఈ తరుణంలో ప్రస్తుతం సవరించడం జరుగుతున్నదని ఆయన అన్నారు. వారి తోడ్పాటును ఈ దశలో గుర్తుకు తెచ్చుకోవడం అధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకొంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు.
తొలి ప్రధాని నేతాజీ సుభాశ్ చంద్ర బోస్ తోడ్పాటును ఎర్ర కోట నుంచి అండమాన్ నికోబార్ వరకు ఘనంగా జరుపుకోవడం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ఏర్పాటు చేయడం ద్వారా సర్ దార్ పటేల్ తోడ్పాటును స్మరించుకోవడం, ‘పంచ్ తీర్థ్’ ద్వారా డాక్టర్ ఆంబేడ్ కర్ తోడ్పాటును స్మరించుకోవడం వంటి ఉదాహరణలను గురించి ప్రధాన మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘వేరు వేరు కారణాల వల్ల గుర్తింపునకు నోచుకోని వ్యక్తులు లెక్కించలేనంత మంది ఉన్నారు. చౌరీ చౌరా పరాక్రమశాలుల విషయంలో ఏమి జరిగిందో మనం మరచిపోగలమా?’’ అంటూ ప్రధాన మంత్రి ప్రశ్నించారు.
భారతీయత ను పరిరక్షించడానికి మహారాజా సుహేల్ దేవ్ అందించినతోడ్పాటును సైతం అదే విధంగా అలక్ష్యం చేయడం జరిగిందని ప్రధాన మంత్రి అన్నారు. పాఠ్య పుస్తకాలలో మహారాజా సుహేల్ దేవ్ను అలక్ష్యం చేసినప్పటికీ కూడాను అవధ్, తరాయీ, పూర్వాంచల్ జానపద గాథల ద్వారా ఆయన ప్రజల మనస్సులలో సజీవంగా కొలువుదీరి ఉన్నారన్నారు. ఒక సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి పాలకునిగా, అభివృద్ధి ప్రధానమైన దృష్టి కలిగినటువంటి పాలకునిగా ఆయన అందించిన తోడ్పాటును ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చారు. మహారాజా సుహేల్ దేవ్ స్మారక చిహ్నం రాబోయే తరాలకు ప్రేరణను అందించగలదన్న ఆశభావాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. వైద్య కళాశాల ను ఏర్పాటు చేయడం, వైద్య సౌకర్యాల ను విస్తరించడం అనేవి ఈ ఆకాంక్షభరిత జిల్లా ప్రజలతో పాటు సమీప ప్రాంతాల ప్రజల జీవనాన్ని మెరుగు పరుస్తాయని ఆయన అన్నారు. మహారాజా సుహేల్ దేవ్ స్మారకార్థం ఒక స్టాంపును రెండు సంవత్సరాల కిందటే ప్రధాన మంత్రి విడుదల చేశారు.
బసంత్ పంచమి సందర్భంలో ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వసంతం మహమ్మారి తాలూకు నైరాశ్యాన్ని వెనుకకు నెట్టివేసి, భారతదేశానికి కొత్త ఆశను తీసుకు వచ్చిందన్నారు. సరస్వతి మాత భారతదేశంలో జ్ఞానాన్ని, విజ్ఞాన శాస్త్రాన్ని, అలాగే పరిశోధనలు, నూతన ఆవిష్కరణల ద్వారా దేశ నిర్మాణంలో తలమునకలుగా ఉన్న ప్రతి ఒక్క పౌరుడిని/ పౌరురాలిని దీవిస్తారన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. గడచిన కొన్ని సంవత్సరాలలో చరిత్ర, విశ్వాసం, ఆధ్యాత్మికతలకు సంబంధించి నిర్మాణం జరిగినటువంటి కట్టడాల అతి పెద్ద లక్ష్యమల్లా పర్యటనను ప్రోత్సహించడమేనని ప్రధాన మంత్రి అన్నారు. అటు పర్యటనలు, ఇటు తీర్థయాత్రల పరంగా చూసినప్పుడు ఉత్తరప్రదేశ్ సైతం సంపన్నమైందేనని, మరి దీని తాలూకు అవకాశాలు కూడా అనంతంగా ఉన్నాయి అని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్లో పర్యటన రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు గాను భగవాన్ రాముడు, శ్రీ కృష్ణుడు, భగవాన్ బుద్ధుడుల జీవనానికి సంబంధించిన స్థలాలైన అయోధ్య, చిత్రకూట్, మథుర, వృందావన్, గోవర్ధన్, కుశీనగర్, శ్రావస్తి మొదలైన ప్రదేశాలను తీర్చిదిద్దుతూ, రామాయణ సర్క్యూట్, స్పిరిట్యువల్ సర్క్యూట్, బుద్ధిస్ట్ సర్క్యూట్లను అభివృద్ధిపర్చడం జరుగుతోందన్నారు. ఈ ప్రయాసలు అన్నీ కూడా ఫలితాలను ఇవ్వడం మొదలు పెట్టాయని, ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి గరిష్ట సంఖ్యలో పర్యటకులను ఉత్తరప్రదేశ్ ఆకట్టుకొంటోందన్నారు. విదేశీ యాత్రికులను ఆకర్షించడంలో దేశంలో అగ్రగామి మూడు రాష్ట్రాల సరసన ఉత్తరప్రదేశ్ సైతం చేరింది అని ఆయన అన్నారు.
యాత్రికులకు అవసరమైన సదుపాయాలతో పాటే అధునాతన సంధానాన్ని కూడా ఉత్తరప్రదేశ్లో అభివృద్ధిపర్చడం జరుగుతోందని ప్రధాన మంత్రి చెప్పారు. అయోధ్య విమానాశ్రయం, కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం రాబోయే కాలంలో ఇటు దేశీయ యాత్రికులకు, అటు విదేశీ యాత్రికులకు ఎంతో ఉపయోగకరంగా రుజువు చేసుకొంటాయని కూడా ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్లో చిన్న, పెద్ద విమానాశ్రయాలు కలుపుకొని డజను దాకా నిర్మాణంలో ఉన్నాయి, వాటిలో చాలా వరకు పూర్వాంచల్లోనే ఉన్నాయని ప్రధాన మంత్రి అన్నారు. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే, బుందేల్ ఖండ్ ఎక్స్ప్రెస్ వే, గంగా ఎక్స్ప్రెస్ వే, గోరఖ్ పుర్ లింక్ ఎక్స్ప్రెస్ వే, బలియా లింక్ ఎక్స్ప్రెస్ వేల వంటి ఆధునికమైన, విశాలమైన రహదారులను ఉత్తరప్రదేశ్ అంతటా నిర్మించడం జరుగుతోందని, ఇది ఒక రకంగా ఆధునిక ఉత్తరప్రదేశ్లో నవీన మౌలిక సదుపాయాల కల్పనకు ఆరంభమే అని ప్రధాన మంత్రి వివరించారు.
రెండు పెద్ద డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లకు కూడలిగా ఉత్తరప్రదేశ్ ఉందని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్లో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన ఈ రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పడానికి ఇన్వెస్టర్లను ఉత్సాహపరిచిందన్నారు. దీనితో పరిశ్రమలకు, అదే మాదిరిగా యువతకు మెరుగైన అవకాశాలు అందించినట్లు అవుతోందని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కరోనాను పరిష్కరించిన తీరును ప్రధానమంత్రి కొనియాడారు. తిరిగి వచ్చిన శ్రామికులకు ఉపాధిని అందించినందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు. గత మూడు, నాలుగేళ్ళుగా ఉత్తరప్రదేశ్ చేస్తూ వచ్చిన ప్రయత్నాలు కరోనాకు వ్యతిరేకంగా కూడా ఎంతగానో తోడ్పడ్డాయి అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కృషి కారణంగా పూర్వాంచల్లో మెనింజైటిస్ సమస్య చాలా వరకు తగ్గిపోయిందన్నారు. గత ఆరు సంవత్సరాలలో ఉత్తరప్రదేశ్లో వైద్య కళాశాల ల సంఖ్య 14 నుంచి 24కు పెరిగిందని ప్రధాన మంత్రి అన్నారు. అంతేకాకుండా గోరఖ్ పుర్లో, బరేలీలో ఎఐఐఎమ్ఎస్ తాలూకు పనులు జరుగుతున్నాయన్నారు.
ఇవి కాక 22 నూతన వైద్య కళాశాలల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. పూర్వాంచల్ కోసం వారాణసీలో ఆధునిక కేన్సర్ ఆసుపత్రి సదుపాయాన్ని కూడా అందించడం జరుగుతోందన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి మంచినీటి సరఫరాకై ఉద్దేశించిన యూపీ జల్ జీవన్ మిషన్ సైతం ప్రశంసనీయమైనటువంటి కృషిని కనబరుస్తోందన్నారు. శుద్ధమైన తాగునీరు ఇంటికి చేరుకొందీ అంటే గనక అది ఎన్నో రోగాలను తగ్గిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. మెరుగైన విద్యుత్తు, నీరు, రోడ్లు, ఆరోగ్య సదుపాయాల ప్రత్యక్ష ప్రయోజనాన్ని ఉత్తరప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులు, పేద ప్రజలు అందుకొంటున్నారని ప్రధాన మంత్రి అన్నారు. ‘పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా ఉత్తరప్రదేశ్లో సుమారు 2.5 కోట్ల రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాలలో డబ్బును నేరుగా జమ చేయడం జరిగిందన్నారు. ఈ రైతు కుటుంబాలు ఒకప్పుడు ఒక బస్తా ఎరువును కొనడానికి కూడా ఇతరుల వద్ద నుంచి అప్పును తీసుకోక తప్పని స్థితి ఉండేది అని అయన చెప్పారు. సాగునీటి కోసం విద్యుత్తును వినియోగించుకోవడానికి ఇక్కడి రైతులు రాత్రంతా మేల్కొనివుండవలసి వచ్చేది అని ఆయన చెప్తూ తన ప్రభుత్వం విద్యుత్తు సరఫరాను మెరుగుపరచడం ద్వారా అలాంటి సమస్యలను తీర్చివేసిందన్నారు. వ్యవసాయ భూముల ను సుసంఘటితం చేయడానికి, దాని ద్వారా ఒక్కో రైతు సాగు చేసే ప్రాంతం కుంచించుకుపోయే సమస్య ను పరిష్కరించడానికి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్పిఎస్) చాలా ముఖ్యం అని ప్రధాన మంత్రి చెప్పారు. 1- 2 బీఘాల నేలను కలిగివున్న 500 రైతు కుటుంబాలు సంఘటితం అయ్యాయంటే గనక అప్పుడు వారు 500- 1000 బీఘా భూమి కలిగిన రైతుల కంటే మరింత శక్తిమంతం అవుతారు అని ఆయన చెప్పారు.
అదే విధం గా కాయగూరలు, పండ్లు, పాలు, చేపలు, ఇంకా ఆ తరహా అనేక వ్యాపారాలతో సంబంధం కలిగివున్న చిన్న రైతుల ను ప్రస్తుతం ‘కిసాన్ రైల్’ ద్వారా పెద్ద బజారులతో జోడించడం జరుగుతోంది అని కూడా ఆయన చెప్పారు. ఇటీవల ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ సంస్కరణలు సైతం చిన్న రైతులకు, సన్నకారు రైతులకు ప్రయోజనం కలిగించేవేనని, ఈ సాగు చట్టాల విషయంలో సకారాత్మకమైన ప్రతిస్పందన దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతోందని ఆయన అన్నారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్ని రకాలైన తప్పుడు సమాచారం వ్యాప్తిలోకి వస్తోందని ప్రధానమంత్రి అన్నారు. విదేశీ కంపెనీలను దేశంలోకి పిలిపించడం కోసం చట్టాలను చేసిన వారు భారతీయ కంపెనీల పేరుతో రైతులను భయపెడుతున్నారు అని ఆయన అన్నారు. ఈ అసత్యాలు, ప్రచారం తాలూకు గుట్టు రట్టు అయింది అని అయన అన్నారు. కొత్త చట్టాలకు శాసన రూపం ఇచ్చిన తరువాత కిందటి సంవత్సరంతో పోల్చి చూసినప్పుడు ఉత్తరప్రదేశ్లో ధాన్య సేకరణ రెట్టింపు అయిందన్నారు. యోగి ప్రభుత్వం ఇప్పటికే ఒక లక్ష కోట్ల రూపాయలను చెరకు రైతుల కోసం విడుదల చేసిందన్నారు. చక్కెర మిల్లులకు రైతులకు చెల్లింపులు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కొద్దీ కోట్ల రూపాయలను కేంద్రం ఇచ్చిందన్నారు. చెరకు రైతులకు సకాలంలో చెల్లింపు జరిగేటట్లు చూడటానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పాటుపడుతూనే ఉంటుందని ఆయన అన్నారు.
రైతు జీవితాన్ని, గ్రామీణ జీవితాన్ని మెరుగుపర్చడం కోసం సాధ్యమైన ప్రతి ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది అంటూ ప్రధాన మంత్రి హామీ ని ఇచ్చారు. ‘స్వామిత్వ పథకం’ అనేది ఒక పల్లెవాసి ఇంటి ని చట్టవిరుద్ధంగా ఆక్రమించుకొనేందుకు అవకాశం లేకుండా చేస్తుంది అని ఆయన చెప్పారు. ఈ పథకంలో భాగంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని దాదాపు 50 జిల్లాలలో డ్రోన్ల ద్వారా సర్వేక్షణలను నిర్వహించడం జరుగుతోందన్నారు. రమారమి 12 వేల గ్రామాలలో డ్రోన్ సర్వేక్షణ పని పూర్తయిందని, ఇంతవరకు2 లక్షలకు పైగా కుటుంబాలు సంపత్తి కార్డులను అందుకొన్నాయని, ఈ కుటుంబాలు ఇంకా అన్ని రకాలైన భయాల నుంచి విముక్తం అయ్యాయని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కారణంగా రైతుకు చెందిన భూమిని వ్యవసాయ సంస్కరణ చట్టాల ద్వారా అన్యాయంగా ఆక్రమించుకొంటార్న వదంతిని ఎవరైనా ఎలా నమ్ముతారని ప్రధాన మంత్రి నొక్కి వక్కాణించారు.
ప్రతి ఒక్క పౌరునికి, పౌరురాలికి సాధికారితను కల్పించాలనేదే మా లక్ష్యంగా ఉందని, దేశాన్ని ‘ఆత్మనిర్భర్’గా తీర్చిదిద్దాలనేది మా వాగ్ధానంగా ఉందని, మరి ఈ కార్య భారాన్ని నెరవేర్చడానికి మేము అంకితం అయ్యాం అని ఆయన అన్నారు. గోస్వామి తులసీదాస్ రచించిన రాంచరిత్ మానస్లో నుంచి కొంత భాగాన్ని ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు. ఆయన ఉదాహరించిన ఆ పంక్తుల కు అర్థం ఏమిటి అంటే సరి అయినటువంటి ఉద్దేశ్యంతో చేపట్టే పని ఏదైనా, మరి అలాగే ఒకరి హృదయంలో భగవాన్ రాముడు కొలువై ఉన్నారంటే, అప్పుడు ఆ కార్యం సఫలం అవుతుంది అని భావం.