రాయ్పూర్, ఏప్రిల్ 5 (న్యూస్టైమ్): కేంద్ర ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు పెడుతూ మావోయిస్టులు ఓ లేఖ రాశారు. రాకేశ్వర్ సింగ్ తమ ఆధీనంలోనే ఉన్నాడని నక్సల్స్ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను పెట్టారు. ఆపరేషన్ ప్రహార్-3ని తక్షణమే నిలిపివేయాలని ప్రధానంగా లేఖలో పేర్కొన్నారు.
అంతే కాదు ఏప్రిల్ 26న భారత్ బంద్కు పిలుపునిచ్చారు. బీజాపూర్ ఎన్కౌంటర్ తరువాత గల్లంతైన కోబ్రా జవాన్ రాకేశ్వర్సింగ్ తమ ఆధీనంలోనే ఉన్నాడని మావోయిస్టులు ప్రకటించారు. రాకేశ్వర్సింగ్కు ఎలాంటి హానీ చేయమని తెలిపారు మావోయిస్టులు. మరోవైపు, రాకేశ్వర్సింగ్ను విడుదల చేయించాలని ఆయన కుటుంబ సభ్యులు కేంద్ర హోం మంత్రి అమిత్షాను వేడుకున్నారు.
చత్తీస్ఘడ్లోని బీజాపూర్-సుక్మా సరిహద్దులో నరమేథం సృష్టించిన మావోలు పచ్చని దండకారణ్యంలో రక్తం ఏరులై పారించారు. మావోలు పన్నిన ఉచ్చులో పద్మవ్యూహంలో అభిమన్యుడిలా చిక్కుకుపోయారు జవాన్లు. ఒక్కసారిగా యూ ఆకారంలో మూడు వైపుల నుంచి చుట్టుముట్టిన మావోలు జవాన్లపైకి బుల్లెట్ల వర్షం కురిపించారు. ఊహించని మావోల దాడితో భద్రతా దళాలు అప్రమత్తమై ఎదురుదాడికి దిగినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 24 మంది జవాన్లు వీరమరణం పొందారు.
కోబ్రా యూనిట్కు చెందిన రాకేశ్వర్సింగ్ను బందీగా పట్టుకున్నారు మావోయిస్టులు. దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో అమరులైన జవాన్ల మృతదేహాలకు బీజాపూర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అధికార లాంఛనాలతో ఘనంగా నివాళులు అర్పించారు. వీర జవాన్ల డెడ్బాడీస్ను ప్రత్యేక అంబులెన్సుల్లో స్వస్థలాలకు తరలించారు. తమ వారి చివరి చూపుల కోసం అక్కడికి చేరుకున్న అమరుల కుటుంబ సభ్యుల రోదనలతో మిన్నంటింది ఆ ప్రాంతం.
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్. అమర జవాన్ల కుటుంబాలకు దేశం అండగా ఉంటుందన్నారు. జవాన్ల త్యాగాలు వృధా కాబోవన్నారు. ఈ దుశ్ఛర్యకు పాల్పడిన మావోయిస్ట్లను వదిలిపెట్టేదే లేదని వార్నింగ్ ఇచ్చారు హోం మంత్రి అమిత్ షా.